
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 18:
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం పై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కుప్పం రెవెన్యూ కార్యాలయంలో శనివారం గ్యాస్ ఏజెన్సీల యజమానులు, గ్యాస్ పంపిణీ సిబ్బందితో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మట్ సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి గ్యాస్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత సేవల ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంటింటికి గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే సమయంలో వినియోగదారులతో మర్యాద పూర్వకంగా,గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలకు మించి ఎట్టి పరిస్థితుల్లో నూ అదనపు డబ్బులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. అదనపు వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ పంపిణీ సేవలను అందించడం ప్రతి ఏజెన్సీ బాధ్యత అని పేర్కొన్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించాలని, సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేసినా లేదా ఇబ్బందులకు గురి చేసినా ప్రజలు వెంటనే సంబంధిత తహసీల్దార్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా ప్రాధాన్య కార్యక్రమాల విజయవంతమైన అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో గ్యాస్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.


Recent Comments