
ఎస్.ఆర్.పురం,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 18:
ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మండల రెవెన్యూ కార్యాలయాల్లో శనివారం రెవెన్యూ ఈ-కోర్టులను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎస్.ఆర్.పురం తహసీల్దార్ లోకనాథ పిళ్ళై మండల కార్యాలయంలో ఈ-కోర్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ఆర్డీఓ పరిధిలోని రివిజన్ పిటిషన్లు, ఆర్ఓఆర్కు సంబంధించిన వివిధ కేసులను ఆన్లైన్ విధానంలో విచారించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రజలు, అధికారులు, న్యాయవాదులు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు మండల కేంద్రం నుంచే విచారణలు నిర్వహించే అవకాశం కల్పించడంతో సమయం, వ్యయం ఆదా అవుతుందని చెప్పారు. రెవెన్యూ ఈ-కోర్టుల ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని, అధికారులు కూడా కార్యాలయాల్లోనే ఉండి ప్రజలకు మరింత అందుబాటులో సేవలు అందించగలరని తహసీల్దార్ లోకనాథ పిళ్ళై తెలిపారు.


Recent Comments