
నిజాంపేట్,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 24:
పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి డాక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. బాచుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్లో మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే భావనతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి ఆదివారం శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు. శిబిరానికి హాజరుకావాలనుకునే వారు ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల మధ్య 70752 12612 నంబర్కు ఫోన్ చేసి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించారు. సాధారణంగా మహిళల్లో ప్రతి నెల బహిష్టు కారణంగా రక్తహీనత, అలసట, ఆయాసం, హీమోగ్లోబిన్ తగ్గుదల వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో శిబిరంలో కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్షలు నిర్వహించి ముఖ్యంగా హీమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ స్థాయిలను గుర్తించి తగిన వైద్య సలహాలు అందిస్తున్నామని వివరించారు. శిబిరంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు వైద్య సేవలను అభినందించారు. భవిష్యత్తులో ఈ శిబిరాన్ని దశల వారీగా మరింత విస్తరించి ఎక్కువ మందికి సేవలు అందించాలని కోరారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పొందారు.


Recent Comments