సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్08:
న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులందరూ తమ విధులను బహిష్కరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పి.లక్ష్మయ్య మాట్లాడుతూ… రాష్ట్రంలో రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం న్యాయవాదుల కు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పీలేరులో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య పై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. న్యాయవాదుల ఐక్యతను కాపాడుతూ, భవిష్యత్తులో న్యాయవాదులపై ఎవరైనా దాడులు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అనంతరం స్థానిక ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణం ఎదుట నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుండి షార్ వై జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం కార్యదర్శి కే. ధర్మ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ నత్తం శ్రీనివాసులు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.


Recent Comments