
చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 24:
జిల్లాలో నిర్వహించే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో వినూత్నంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కె. మోహన్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, ప్రతి శాఖ ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరస్పర సమన్వయం తో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమాజానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సత్కరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వైద్యం, విద్య, వ్యవసాయం, కళలు, సేవా రంగం, వ్యాపారం, సృజనాత్మక రంగం, విద్యుత్, స్వచ్ఛత–పరిశుభ్రత, క్రీడలు తదితర పది విభాగాల్లో వ్యక్తిగత, సంస్థాగత కేటగిరీల వారీగా విశేష సేవలందించిన అర్హులను ఎంపిక చేసి జాబితాలను పంపించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన, వివాదాలకు తావులేని వ్యక్తులు, సంస్థలనే అవార్డులకు ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులు, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, వినూత్న వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతులు, కళలను పరిరక్షిస్తున్న కళాకారులు, నిస్వార్థ సేవ చేస్తున్న సేవా సంస్థలు, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఆదర్శంగా నిలిచినవారు, సృజనాత్మక ప్రతిభ కనబరిచినవారు, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలు, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచిన గ్రామాలు, పట్టణ స్థానిక సంస్థలు, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులు, క్రీడా సంస్థలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లాలో ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, అవార్డులకు సంబంధించిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా అందజేయాలని డీఆర్ఓ కె. మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు.


Recent Comments