
ఎస్.ఆర్.పురం,చిత్తూరు ఎక్స్ప్రెస్,ఆగస్టు 29:
ఎస్.ఆర్.పురం మండలంలోని గంగమ్మగుడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష ప్రాధాన్యతతో పాటు క్రీడల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచిన మధురమైన భాష అని అన్నారు. తెలుగు భాషను గౌరవించి,ప్రేమించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలగా శ్రమిస్తే క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ప్రతి విద్యార్థి పీవీ సింధు వంటి ప్రతిభావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన గంగమ్మగుడి పాఠశాల విద్యార్థులు కార్తీక్, యశ్వంత్లను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ దర్శకుడు లోకనాథం, తెలుగు ఉపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments