
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ప్రెస్,జూన్ 06:
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కేనమాకులపల్లి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ పార్థసారథి, కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్లబుడుగూరు ఎస్ఐ నరేష్ పాల్గొని గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల్లో ధైర్యం నింపడంతో పాటు సామాజిక భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం, కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత ఫోన్ కాల్స్, సందేశాలు, నకిలీ లింకులు, బ్యాంకు వివరాల మోసాలపై జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు తెలియజేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ అందిస్తున్న సేవలను వివరించి, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలపై కూడా అవగాహన కల్పించిన అధికారులు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. గ్రామస్థులు పోలీసుల సూచనలను ఆసక్తిగా విని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Recent Comments