EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

దొంగతనానికి గురైన వాహనాలను వేగంగా గుర్తిస్తాం ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే సమాచారం ఇవ్వాలి:  జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ 

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే09:

 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తక్షణ పాలనా వ్యవస్థ ఆధారంగా ఏర్పాటు చేసిన నిఘా విధానంతో దొంగతనానికి గురైన వాహనాలను వేగంగా గుర్తించే అవకాశం కల్పించబడిందని చిత్తూరు జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారంవారం విడుదల చేసిన ప్రకటన లో ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు,కార్లు, ఇతరవాహనాలు దొంగతనానికి గురైన వెంటనే సంబంధిత వివరాలను పోలీసు లకు తెలియజేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ ద్వారా వెంటనే గుర్తించే చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర పోలీసు ప్రధాన అధికారి హరీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, నేర నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులు,జాతీయ రహదారులు, పట్టణ ప్రాంతాలు, రుసుము వసూలు కేంద్రాలు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన అత్యాధునిక నిఘా కెమెరాల ద్వారా అనుమానాస్పద వాహనాల కదలికలను గుర్తిస్తున్నామని తెలిపారు. నేరాలకు పాల్పడే వారు ఎక్కడికి వెళ్లినా సాంకేతిక నిఘా వారిని వెంటాడుతుందని హెచ్చరించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు కనిపించకుండా పోయిన ఘటనల్లో కూడా తక్షణ పాలనా వ్యవస్థ సేవల ద్వారా తక్కువ సమయంలోనే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడం సాధ్యమైందన్నారు. ఈ విధానం పోలీసు శాఖకు ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు. వాహనం కనిపించకపోయిన వెంటనే సమీప పోలీసు కేంద్రానికి సమాచారం అందించాలని సూచించారు. వాహనం చివరిసారిగా ఎక్కడ కనిపించింది, ఎప్పుడు గుర్తించారు, వాహన నమోదు సంఖ్య వంటి వివరాలు అందిస్తే పోలీసు లు వేగంగా స్పందించగలరన్నారు. ప్రజల సౌకర్యార్థం చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా 9440900005 సంఖ్యను అందుబాటులో ఉంచిందన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులు, చిత్రాలు, వివరాలను ఈ సంఖ్యకు పంపవచ్చని తెలిపారు. అలాగే వాహనాలను భద్రంగా నిలిపివేయాలని, తాళాలు, భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఖ్యా పలకలు లేని వాహనాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో వాహన దొంగతనాలను పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తోందని,ప్రజలు భయపడకుండా ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి విజ్ఞప్తి చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!