
ఎస్ఆర్పురం,చిత్తూరు ఎక్స్ప్రెస్,జూలై 31:
ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై సుమన్ గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దని సూచించారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండని పిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామాల్లో చిన్నచిన్న విషయాలకు గొడవలు, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఆనంద్, సుబ్రమణ్యం, కృష్ణయ్య, జయరాం, శేఖర్, స్వామినాథన్, నాగేంద్రబాబు, బుజ్జమ్మ, తులసి, మమత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments