
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే17:
సూళ్లూరుపేట నియోజకవర్గ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించిన సూళ్లూరుపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్ పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన నాయుడుపేట పట్టణ జట్టు విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక ఎస్పీఎల్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. విజేత జట్టుకు రూ.50 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీని శాసనసభ్యురాలు అందజేశారు. గట్టి పోటీ ఇచ్చిన సూళ్లూరుపేట పట్టణ జట్టు రన్నరప్గా నిలిచి రూ.25 వేల నగదు బహుమతిని అందుకుంది. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. యువత అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, క్రీడా రంగ పురోగతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువతలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు ఆకుతోట రమేష్,ఉయ్యాల ప్రవీణ్,రఫీ,ఏజీ కిషోర్, క్రీడాభిమానులు,యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Recent Comments