
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 10:
సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేయవద్దని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వినియోగంపై చిత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. వాట్సాప్ సమూహాలు, ముఖపుస్తకం, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర వేదికల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలు, చిత్రాలు, దృశ్యాలు లేదా అభ్యంతరకర విషయాలను పంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. మత విద్వేషాలను ప్రోత్సహించే లేదా అశాంతిని సృష్టించే విషయాలను ప్రచారం చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని స్పష్టం చేశారు. ఒక్క పోస్టు కూడా సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని, ఏ విషయం పంచుకునే ముందు దాని ప్రభావాన్ని ఆలోచించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల సమూహ నిర్వాహకులు తమ సమూహాల్లో పంచుకునే ప్రతి సందేశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ద్వేషపూరిత, రెచ్చగొట్టే లేదా అభ్యంతరకర విషయాలు గుర్తిస్తే వెంటనే వాటిని తొలగించి సంబంధిత వ్యక్తులను సమూహం నుంచి తొలగించాలని తెలిపారు. తప్పుడు ప్రచారం, కల్పిత వార్తలు, మార్పులు చేసిన చిత్రాలు లేదా దృశ్యాలను సృష్టించే, పంచుకునే లేదా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఏ సమాచారాన్నైనా నమ్మే ముందు సంబంధిత అధికారులు లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. వదంతుల కారణంగా ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, శాంతి భద్రతలకు భంగం కలగవచ్చని తెలిపారు. ఎవరైనా మత విద్వేషాలు లేదా వదంతులు వ్యాప్తి చేస్తున్నట్లు తెలిసిన వెంటనే జిల్లా పోలీసు కార్యాలయం లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాలను ప్రజా ప్రయోజనాలు, అవగాహన కార్యక్రమాలు, సానుకూల సందేశాల కోసం మాత్రమే బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై సైబర్ నేర చట్టాలు మరియు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి హెచ్చరించారు.


Recent Comments