
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 02:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పి.ఎస్. మునిరత్నం తెలిపారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్బాబు, ఏఎంసీ చైర్మన్ జి.ఎం.రాజు, కడ సలహా మండలి సభ్యుడు రాజ్కుమార్ పర్యటన వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనలో పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసభలు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే కుప్పం ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాల ప్రారంభం, కుప్పం పట్టణ ప్రవేశ ద్వారం, ఫుడ్ ప్లాజా, ఎల్పీజీ శ్మశానవాటిక ప్రారంభోత్సవాలు, మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన, అర్హులకు అసైన్మెంట్ పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారని పేర్కొన్నారు. మూడో రోజు రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై చర్చించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు నాయకులు పిలుపునిచ్చారు.


Recent Comments