చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 09:
పాఠశాలలు,కళాశాలల పరీక్షలు పూర్తయ్యిన నేపథ్యంలో విద్యార్థులు బయటకు ఎక్కువగా తిరుగుతున్న ఈ సమయంలో మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడపడం పెరుగుతోందని చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 సంవత్సరాలు పూర్తి కాని వారు మోటారు వాహనాలు నడపడం నిషేధం అని తెలిపారు. అయినప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా పిల్లలకు వాహనాలు ఇస్తున్నారని, ఇది చట్ట విరుద్ధం మాత్రమే కాకుండా ప్రాణాపాయానికి దారి తీసే ప్రమాదకర చర్య అని పేర్కొన్నారు. మైనర్ వాహనం నడిపిన పక్షంలో తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై బాధ్యత ఉంటుందని చెప్పారు. అలాంటి సందర్భాల్లో 25 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉండడంతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వాహనం నమోదు ఒక సంవత్సరం వరకు రద్దు చేయబడే అవకాశముందని పేర్కొన్నారు. మైనర్కు 25 సంవత్సరాల వయస్సు వరకు డ్రైవింగ్ అనుమతి ఇవ్వకుండా నిలిపివేయవచ్చని తెలిపారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన పక్షంలో వాహనాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని, వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలియజేయాలని, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో పర్యవేక్షించాలని అన్నారు. అవసరమైతే ప్రజా రవాణా వాహనాలను వినియోగించేందుకు ప్రోత్సహించాలని సూచించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని చెప్పారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మైనర్ డ్రైవింగ్పై చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు చేపడుతున్నారని, ప్రజలు సహకరించి తమ పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు


Recent Comments