
చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 12:
చిత్తూరు పట్టణంలో ప్రారంభమైన గంగమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు చిత్తూరు డీఎస్పీ జె. వెంకటనారాయణ తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జాతర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జాతరకు వచ్చే మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఓం శక్తి ఊరేగింపు మరియు జాతర ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్, మద్యం సేవించి అల్లర్లు, గొలుసు చోరీలు, జేబుదొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతర ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులు, షీ టీమ్స్, ప్రత్యేక పికెట్స్తో పాటు డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. గాంధీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటల పాటు పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, చోరీలకు పాల్పడే వారిని సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చిన్నారులను ఒంటరిగా వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజల సహకారంతో గంగమ్మ జాతరను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.


Recent Comments