
శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు06:
హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం ద్వారా సామరస్య సమాజ నిర్మాణం లక్ష్యంగా నిర్వహిస్తున్న “మిడియేషన్ ఫర్ ది నేషన్ డ్రైవ్” కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాళహస్తి కోర్టు ఆవరణ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని 12వ అదనపు జిల్లా జడ్జి లలాష్ పెదగాడి, సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. న్యాయస్థానాలపై పెరుగుతున్న భారం తగ్గించడంతో పాటు వివాదాలను పరస్పర చర్చలద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ విధానం సమర్థవంతమైన మార్గమని తెలిపారు. ప్రజల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన పెంపొందించడం, కోర్టుల వెలుపల తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తుందని వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ విధానాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, మధ్యవర్తిత్వ నిపుణులు, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments