
రాయచోటి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు06:
వీఐపీ బందోబస్తు, పేలుడు పదార్థాల గుర్తింపు వంటి కీలక విధుల్లో విశేష సేవలందించిన అన్నమయ్య జిల్లా పోలీసు జాగిలం ‘రాజా’ (ల్యాబ్రడార్) అనారోగ్యంతో గురువారం కన్నుమూసింది. రాయచోటిలోని పాత పోలీసు క్వార్టర్స్లో రాజా పార్థివ దేహానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు శాఖకు రాజా అందించిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసి కొనియాడారు. అనంతరం పూర్తి పోలీసు లాంఛనాలతో రాజా అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, సీఐలు చలపతి, రోషన్, కృష్ణంరాజు నాయక్, చాంద్ బాషా, ఆర్ఐ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఎస్ఐలు,డాగ్ స్క్వాడ్ సిబ్బంది,ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని రాజాకు భావోద్వేగ వీడ్కోలు పలికారు. పోలీసు విధుల్లో నిబద్ధతతో సేవలందించిన రాజా మృతి పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.


Recent Comments