
చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 15:
చిత్తూరు జిల్లాలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో భాగంగా డీడీఓలు, ప్రజా సమాచార అధికారులు (పీఏఓలు), తొలి అప్పీళ్ల అధికారుల (ఎఫ్ఐఏలు) నమోదు, మ్యాపింగ్ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆర్టీఐ అమలు, భూ సమస్యలకు సంబంధించిన కోర్టు కేసుల పురోగతిపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీఓల లాగిన్ ప్రక్రియ దాదాపు పూర్తైందని, మిగిలిన కార్యాలయాలు కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో పీఏఓలు, ఎఫ్ఐఏల నమోదు, అనంతరం పీఏఓ–ఎఫ్ఐఏ మ్యాపింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖాధిపతి తమ పరిధిలోని కార్యాలయాల్లో నమోదు, మ్యాపింగ్ ప్రక్రియలను స్వయంగా పరిశీలించాలని, సాంకేతిక సమస్యలు ఉంటే ఎన్ఐసీ అధికారుల సహకారంతో వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తులు, నోటీసులు, ఉత్తర్వులు, అప్పీళ్ల పరిష్కారం తదితర ప్రక్రియలన్నీ ఆన్లైన్ పోర్టల్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిరంతర సమీక్ష జరుగుతున్నందున ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం న్యాయ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించిన డీఆర్ఓ, వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న ధిక్కార (కాంటెంప్ట్) కేసులు, రిట్ పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేయడంలో జాప్యం జరగరాదన్నారు. ప్రభుత్వ న్యాయవాదులతో సమన్వయం చేసుకుని పారావైజ్ రిమార్కులు సిద్ధం చేయడంతో పాటు తుది కౌంటర్లు కోర్టులో దాఖలు చేసే వరకు శాఖాధిపతులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సూచించారు. కోర్టు కేసుల్లో ఆలస్యం ప్రభుత్వ ప్రయోజనాలకు నష్టం కలిగించే అవకాశమున్నందున న్యాయ వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని డీఆర్ఓ పేర్కొన్నారు. ధిక్కార కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ఈ నెలాఖరులోగా గణనీయమైన సంఖ్యలో కౌంటర్లు దాఖలు చేయాలని, మిగిలిన వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రిట్ పిటిషన్లలో కూడా పెండింగ్ తగ్గించేలా ప్రభుత్వ న్యాయవాదులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఆర్టీఐ అమలు, న్యాయ వ్యవహారాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి శాఖాధిపతి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని డీఆర్ఓ కె. మోహన్ కుమార్ స్పష్టం చేశారు.


Recent Comments