
గుడిపల్లి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 14:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం బెగ్గిలిపల్లి పంచాయతీలో మంగళవారం ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఆధునిక సాగు విధానాలు, పంటల నిర్వహణపై అవగాహన కల్పించారు. అలాగే రైతులకు పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) పథకం ప్రాధాన్యాన్ని వివరించి, ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాజు మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పంటల బీమా సౌకర్యాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


Recent Comments