
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 02:
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు గ్రామీణాభివృద్ధికి దోహదపడే పథకమే వికసిత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) – వీబీజీ రామ్జీ అని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం జీడీనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్.ఆర్.పురం మండలం క్షీరసముద్రం గ్రామంలో 125 రోజుల వీబీజీ రామ్జీ పథకాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్షీరసముద్రం గ్రామ చెరువు కట్ట నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే జీఎంఆర్పురం కాజ్వే నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశిస్తూ, పనులకు సంబంధించిన అంచనా వ్యయ వివరాలను సిద్ధం చేసి అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ గ్రామస్థులతో నేరుగా మాట్లాడి ఉపాధి హామీ పనుల అమలుపై ఆరా తీశారు. పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకానికి నిధులు సమకూరుస్తున్నాయని తెలిపారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో కూలీల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయ పనుల సీజన్లో కూలీల కొరత రాకుండా పనుల ప్రణాళిక రూపొందించడంతో పాటు, పని లేని కాలంలో ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, నీటి సంరక్షణ, జీవనోపాధి వనరుల సృష్టికి ఈ పథకం దోహదపడుతుందని పేర్కొంటూ గ్రామీణ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీ రవికుమార్, ఎంపీడీవో వనజ, మండల టీడీపీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, మాజీ జిల్లా కార్యదర్శి గంధమనేని రాజశేఖర్ నాయుడు, ఆరిమాని గంగమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుండాల జలేంద్రనాయుడు, మండల సింగిల్ విండో అధ్యక్షుడు నిరంజన్రెడ్డి, గంగమ్మ ఆలయ వైస్చైర్మన్ వెంకటరామయ్య, కూటమి నాయకులు రామకృష్ణ యాదవ్, మాధవరెడ్డి రవి నాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Recent Comments