
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూన్14:
కౌండిన్య అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ, మానవ–ఏనుగు సంఘర్షణ నివారణ, అటవీ శాఖ వ్యవస్థాపక సమస్యలు, సరిహద్దు గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ విషయాన్ని కౌండిన్య అభయారణ్య వన్యప్రాణి సంరక్షణ సమితి ప్రతినిధి, న్యాయవాది, సామాజిక కార్యకర్త ఎ.నరేంద్ర ఆజాద్ వెల్లడించారు. ఈ ఏడాది మే 6న కౌండిన్య అభయారణ్యానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర విజ్ఞాపన పత్రం పంపినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాజెక్ట్ టైగర్, ఏనుగు విభాగం స్పందించి సంబంధిత అంశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆ విజ్ఞాపనను ఆంధ్రప్రదేశ్ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (వన్యప్రాణులు), ముఖ్య వన్యప్రాణి సంరక్షణాధికారికి పంపించి, అమల్లో ఉన్న చట్టాలు, మార్గదర్శకాలు, 2023 మానవ–ఏనుగు సంఘర్షణ నివారణ మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. అలాగే తీసుకునే చర్యల వివరాలను విజ్ఞాపనదారునికి తెలియజేయడంతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖకు కూడా నివేదించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇది వ్యక్తిగత విజయంగా కాకుండా కౌండిన్య అభయారణ్యం, సరిహద్దు గ్రామాల రైతులు,అటవీ సిబ్బంది, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న సమిష్టి కృషికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు నరేంద్ర ఆజాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఏనుగుల సమస్యతో పాటు నెమళ్లు, చిరుతలు, ఇతర అడవి జంతువుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, అటవీ కారిడార్ల సంరక్షణ, అక్రమ క్వారీల నియంత్రణ, నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై శాస్త్రీయ ఆధారాలతో కృషి కొనసాగుతు న్నట్లు తెలిపారు. అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ద్వారానే పర్యావరణ సమతుల్యత సాధ్యమవు తుందని పేర్కొంటూ, ఈ ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.


Recent Comments