
పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే08:
చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధి బాధ్యత అంగన్వాడీ లదేనని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి ప్రాజెక్టు పరిధిలోని వి. కోట, బైరెడ్డిపల్లి మండలాలకు చెందిన ఒక అంగన్వాడీ వర్కర్, 32 మంది అంగన్వాడీ సహాయకులకు పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం నియామక ఉత్తర్వులను ఆయన పంపిణి చేశారు. ఈ ఏడాది జనవరిలో అంగన్వాడీ వర్కర్, 41 సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా మార్చి నెలలో జరిగిన ఇంటర్వూలలో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల సాధికారతకు అంగన్వాడీ వ్యవస్థ ఎంతో ముఖ్యమని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా నియామక ప్రక్రియను నిర్వహించి అర్హులైన వారికి అవకాశాలు కల్పించిందన్నారు. నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపివో అరుణశ్రీ, సూపర్వైజర్లు లత, స్వర్ణలత, మాధవిలతతో పాటు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ్, రాంబాబు నాయకులు రంగనాథ్, ఈశ్వర్ గౌడ్,హరి, మంజునాథ్ మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments