
రేణిగుంట, చిత్తూరు ఎక్సప్రెస్, మే 08:
రేణిగుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు మే 1 నుంచి జూన్ 9 వరకు నిర్వహిస్తున్న “కిషోరి వికాసం” కార్యక్రమంలో భాగంగా వినాయక నగర్, పాంచాలి నగర్ ప్రాంతాల్లో కిషోరి బాలికలకు రక్తహీనత (అనీమియా) నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కామరాజు మాట్లాడుతూ,శరీరంలో హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత సమస్య వస్తుందని, ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం,ఐరన్,ఫోలిక్ యాసిడ్, విటమిన్ల లోపం, రుతుస్రావం వంటి కారణాలతో అనీమియా వస్తుందని వివరించారు.రక్తహీనత నివారణకు ఆకుకూరలు, పాలు, గుడ్లు, పండ్లు, ఖర్జూరం, బెల్లం, నల్ల నువ్వులు, ఉసిరి, సిట్రస్ పండ్లు వంటి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు రక్తపరీక్షలు చేయించుకుని వైద్యులను సంప్రదించాలని చెప్పారు. అదేవిధంగా వేసవి తీవ్రత నేపథ్యంలో వడదెబ్బ నివారణపై కూడా అవగాహన కల్పించారు. తరచూ నీరు తాగడం, మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం, లేత రంగు దుస్తులు ధరించడం, ఓఆర్ఎస్ ద్రావణం వినియోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎఎన్ఎంలు రేవతి, విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, బాలికలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Recent Comments