కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్,జూన్ 30:
మామిడి రైతుల సమస్యలను పక్కనపెట్టి వైసీపీ నాయకులు రాజకీయ నాటకాలకు పాల్పడుతున్నారని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్.మునిరత్నం,పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్.సురేష్బాబు విమర్శించారు. మంగళ వారం కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జి.ఎం. రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మామిడి రైతులపై వైసీపీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే తక్కువ ధర చెల్లిస్తున్న కంపెనీల ఎదుటే ఆందోళన చేయాలని, రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని నిరసనలు చేపట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ ఫుడ్స్ సంస్థ కిలో మామిడికి రూ.3 మాత్రమే చెల్లిస్తుండగా, జైన్ ఫామ్ ఫ్రెష్ ఫుడ్స్ సంస్థ కిలోకు రూ.6 చెల్లిస్తోందని తెలిపారు. ఈ ధరల వ్యత్యాసం వల్ల రైతులు నెలకు సుమారు రూ.12 కోట్ల మేర నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్న సంస్థపై ప్రశ్నలు లేవనెత్తకుండా, ఎక్కువ ధర చెల్లిస్తున్న సంస్థలపై నిరసనలు చేపట్టడం ద్వారా అసలు సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్కువ ధర చెల్లిస్తున్న కంపెనీ ఎదుటే ధర్నా నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని, రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిని ప్రజలే తగిన సమయంలో నిలదీస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ సెల్వరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.




Recent Comments