EPAPER
Wednesday, March 11, 2026
Google search engine

భయానికి ముగింపు – భద్రతకు ఆరంభం :  శాంతిపురంలో “ధైర్య స్పర్శ” కార్యక్రమం ప్రారంభం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్

📰 Generate e-Paper Clip

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 24:

చిత్తూరుజిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో “ధైర్య స్పర్శ” కార్యక్రమాన్ని శాంతిపురం మండలంలో ఘనంగా ప్రారం భించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తుషార్ దూడి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో భద్రతను పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు, సరిపడ వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత, లక్ష్యపూర్వక పోలీసు చర్యల ద్వారా నేరప్రవణ ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చే చర్యలు చేపట్టారు. “భయానికి ముగింపు – భద్రతకు ఆరంభం” అనే నినాదంతో రోడ్లపై మద్యం సేవనం,మహిళల వేధింపులు,జూదం, మాదకద్రవ్యాల వినియోగం వంటి ప్రతికూల కార్యకలాపాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో కుప్పం ఉపవిభాగ పోలీసు అధికారి పార్థసారధి మరియు కుప్పం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ మార్గదర్శకత్వంలో శాంతిపురం మండలం శివరామపురం – గట్టూరు సర్కిల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక ప్రాంతాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు. అధికారుల సూచనలతో ఆ ప్రదేశంలో ఉన్న ముళ్ల పొదలను యంత్రాల సహాయంతో తొలగించి, వ్యర్థాలను శుభ్రపరిచారు. కార్యక్రమం భాగంగా అక్కడ 10 వీధి దీపాలు, 4 సీసీ కెమెరాలు, 2 గోడ ప్రకటన ఫలకాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 23 ఉదయం అధికారులు శివరామపురం గ్రామాన్ని సందర్శించి “ధైర్య స్పర్శ” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,యువకులు,వాలంటీర్లు చురుకుగా పాల్గొని పోలీసు శాఖకు సహకరించారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ చర్యలకు మంచి స్పందన లభించింది. మహిళలు, విద్యార్థులు,వృద్ధులు ఈ చర్యల వల్ల భద్రతా భావన పెరిగిందని తెలిపారు. పాఠశాల పరిసరాల్లో భద్రత మెరుగు పడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలలో పోలీసు సిబ్బంది, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సురక్షితమైన ప్రజా ప్రదేశాలను అందించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!