EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ప్రభుత్వ భూములను కాపాడండి నకిలీపత్రాలతో వంక పొరంబోకు ఆక్రమణయత్నం కలెక్టర్ సంతకం, ప్రొసీడింగ్స్ ఫోర్జరీ ఆరోపణలు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై విమర్శలు

📰 Generate e-Paper Clip

గంగవరం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 22 :

 

పలమనేరు నియోజకవర్గం గవరం మండలంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ వంక పొరంబోకు భూములను నకిలీ పత్రాలతో ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర సంచలనంగా మారాయి. జిల్లా కలెక్టర్ సంతకం, ప్రొసీడింగ్స్ ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూములను కాజేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వెలువడటంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సహకారంతోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంగవరం మండల పరిధి లోని సర్వే నెంబర్ 244/1లో 1.11 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పేరుతో నకిలీ ప్రొసీడింగ్స్ సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ వ్యవహారం బయటపడటం తో సంబంధిత వ్యక్తులు పరారైనట్లు సమాచారం. అదే తరహాలో సర్వే నెంబర్ 346/2ఏలో ఉన్న 11.13 ఎకరాల వంక పొరంబోకు భూమిని కూడా నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 1బి, అందంగల్ వంటి తప్పుడు పత్రాలు సృష్టించి 2023లో అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వందేళ్లుగా సీసీఎల్ఆర్ రికార్డుల్లో వంక పొరంబోకుగా నమోదై ఉన్న భూమిని ఎలాంటి అధికారిక మార్పులు లేకుండానే ఆక్రమణకు గురి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖ మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వభూములను కాపాడాలని కోరుతూ సంరక్షణ వారపత్రిక ఎడిటర్ ఆర్.రెడ్డెప్ప పలమనేరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే ఫిర్యాదు స్వీకరిం చేందుకు సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యం తొలుత నిరాకరిం చారని సమాచారం. వాగ్వాదం అనంతరం ఫిర్యాదు స్వీకరించినట్లు చెబుతున్నారు. వంక పొరంబోకు భూమిని సబ్ డివిజన్ చేయడానికి అనుసరించాల్సిన నిబంధనలను అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. గంగవరం పంచాయతీ కార్యాలయంలో సర్వే నెంబర్ 346/2ఏకు సంబంధించి ఎటువంటి ప్లాన్ ఆమోదం లేదని తెలిసింది. అలాగే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసిన ఆధారాలు, అభివృద్ధి చార్జీలు చెల్లింపుల వివరాలు పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్లాట్లు వేయకుండానే కాగితాలపై ప్లాట్లు చూపించి విక్రయాలకు సిద్ధమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తుల పేర్లతో కూడా ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం వెలువడింది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన కొందరు అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి కోట్ల రూపాయల లావాదేవీలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన పత్రికలో పనిచేస్తున్న ఓ పాత్రికేయుడు కూడా వంక పొరంబోకు ఆక్రమణ వ్యవహారంలో ఉన్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. సర్వే నెంబర్ 346/2ఏలోని 11.13 ఎకరాల భూమిలో కొంత భాగం స్మశానానికి, మరికొంత బైపాస్ రోడ్డుకు వెళ్లినట్లు సమాచారం. మిగిలిన భూమిని కొంతమంది ఆక్రమించి నకిలీ పత్రాలతో విక్రయాలకు సిద్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల వ్యవహారంపై సంరక్షణ వారపత్రికలో కథనం ప్రచురించగా, ప్రభుత్వ భూములను కాపాడాలని రాసినందు కు ఎడిటర్ ఆర్.రెడ్డెప్పకు డిఫమేషన్ నోటీసులు పంపినట్లు తెలిసింది. కథనంలో ఎవరిపేర్లు ప్రస్తావించక పోయినా నోటీసులు పంపడం ద్వారా సంబంధిత వ్యక్తుల పాత్ర స్పష్టమవుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ భూములపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు పలమనేరు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తక్షణమే సమగ్ర విచారణ జరిపి సంబంధిత రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!