
వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 24:
చిత్తూరుజిల్లా పలమనేరునియోజకవర్గం వి.కోట మండలం లో కొంతమంది గ్యాంగులుగా ఏర్పడి అమాయక ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, వి.కోట సీఐ సోమశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న శ్రీనివాసులు, వి.కోటకు చెందిన గణపతి, ములబాగల్కు చెందిన శివలు గ్యాంగ్గా ఏర్పడి అక్రమ వసూళ్లకు పాల్పడి నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. వి.కోట నారాయణనగర్ కు చెందిన శంకర్ అనే వ్యక్తిఅదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తో సన్నిహితంగా ఉండేవాడని, తన కుమారుడి వివాహ సమయంలో ఆ మహిళ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిందన్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం శంకర్ శ్రీనివాసులను సంప్రదించగా, ఒక లక్ష రూపాయలు ఇస్తే సెటిల్ చేస్తానని చెప్పి ఫోన్పే ద్వారా రూ.31 వేలు తీసుకున్నాడన్నారు. తర్వాత స్థానిక శ్రీవేణుగోపాల స్వామి ఆలయం వద్ద పంచాయతీ నిర్వహించి ఆ మహిళకు రూ.20 లక్షలు ఇవ్వాలని శంకర్పై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. చివరకు రూ.3 లక్షలకు బాండ్ పేపర్ రాయించుకుని వ్యవహారాన్ని ముగించి నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డంగా పెట్టుకుని శ్రీనివాసులు ఆ మహిళతో సన్నిహితంగా మారాడని, ఆమెను హైదరాబాద్కు తీసుకెళ్లడంతో పాటు బైరెడ్డిపల్లిలో కలిసి నివసించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ విషయం తెలిసిన భర్తతో గొడవ సమయంలో మహిళ కాలు విరగగా, దానిని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని గ్యాంగ్ సభ్యులు ఆమె భర్తను బెదిరిం చారని తెలిపారు. “నీవే కాలు విరగొట్టావు.. నీపై కేసు పెడతాం” అంటూ బెదిరించి రూ.1.25 లక్షలు వసూలు చేశారని, ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రాణహాని హెచ్చరికలు చేశారని తెలిపారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడిందన్నారు. ఇల్లు నిర్మాణం సమయంలో మహిళ కుటుంబానికి చెందిన 125 గ్రాముల బంగారాన్ని బ్యాంకులో పెట్టి తీసుకున్న రూ.5 లక్షల రుణాన్ని విడిపించి, మరో బ్యాంకులో రూ.9.50 లక్షలకు తాకట్టు పెట్టినట్లు గుర్తించామని తెలిపారు. పోలీసుల పేర్లు చెప్పుకుంటూ ఈ గ్యాంగ్ అక్రమ దందాలకు పాల్పడినట్లు సమాచారం అందిందన్నారు. ఇలాంటి గ్యాంగులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ, సీఐ కోరారు. ఇంకా మరికొంతమంది కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాల్లో ఉన్నట్లు సమాచారం ఉందని, ప్రజలు భయపడ కుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్న ఇనాయతుల్లా ఖాన్పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోల ను మార్ఫింగ్ చేయడం, కడప అల్లర్లకు సంబంధించిన వీడియోలు,పోస్టులు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడన్నారు. ఫేస్బుక్ యాజమాన్యాని కి అకౌంట్ మూసివేయాలని నివేదించినట్లు తెలిపారు. మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తామని హెచ్చరించారు. ఇంతవరకు సామరస్యంగా హెచ్చరిం చామని, ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. బాధితులు ఎవరైనా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని,ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.


Recent Comments