
గుంటూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 10
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ప్రాంగణంలో సగం వరకు కూల్చివేసి అలాగే వదిలేసిన వాటర్ ట్యాంక్ తీవ్ర ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు పై నుంచి శిథిలాలు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు, వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా ఎం.సి.హెచ్. (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) బ్లాక్కు వెళ్లే గర్భిణీ స్త్రీలు ఇదే మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ప్రమాదకరంగా మారిన ఈ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, ఇదే ప్రాంతంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడంతో వందల సంఖ్యలో వాహనాలు నిలిపివేస్తున్నారు. ఒకవేళ శిథిలాలు కూలిపోతే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సూపరింటెండెంట్ హయాంలోనే ఈ సమస్యను పట్టించుకోలేదని, అదే నిర్లక్ష్య ధోరణి ఇప్పటికీ కొనసాగుతోందని ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత సూపరింటెండెంట్ అయినా ఈ ప్రమాదకర పరిస్థితిపై వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ను పూర్తిగా తొలగించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తారా? లేక గత సూపరింటెండెంట్ మాదిరిగానే ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.


Recent Comments