
గంగవరం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 02:
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండల పరిధిలోని కల్లుపల్లి గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో సురేష్బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో అందుతున్న సేవలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల పరిస్థితిపై వివరాలు సేకరించారు. జిల్లా దళిత నాయకుడు, సామాజిక సేవా కార్యకర్త కె. చిన్న మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీలో గత 15 రోజులుగా తాగునీటి సమస్య నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో సురేష్ బాబు సమస్యను పరిశీలించి రెండు నుంచి మూడు రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గ్రామ స్థాయిలో సమస్యలు పెండింగ్లో ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రతి లబ్ధిదారునికి సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments