కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి08:
కుప్పం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్.వి గ్రూప్స్ అధినేత బి.యం దయానిధి, డాక్టర్ చిత్ర నాగరాజ్, ఐడిపిఎస్ డైరెక్టర్ బి. లోహిత కృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు మరియు కుటుంబ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ సమాజ పురోగతికి బలమైన పునాది వేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. మహిళల విద్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన మరియు నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుందని వారు అన్నారు. నేటి మహిళలు విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ముందంజలో నిలుస్తూ సమాజ అభివృద్ధికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని మహిళల పాత్రపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మహిళా సాధికారతపై పలు సందేశాలతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.


Recent Comments