chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 12:35 pm Digital Edition : CHITTOORE EXPRESS

20వ వార్డులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 24:

 

చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ఆదివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్, క్లస్టర్ ఇంచార్జ్ ఎస్. సోమశేఖర్ ఆధ్వర్యంలో ఏపీవీ స్ట్రీట్‌లో చేపట్టిన ఈ పరిశుభ్రత కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, డ్రైనేజీలను శుభ్రపరచడం, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం చేపట్టారు. పలు ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిశుభ్రతకు సంబంధించిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇళ్లు, వీధులు, పాఠశాలలు, ప్రజా ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా మునిసిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బుట్టలను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి వార్డులో ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి పరిశుభ్రత ప్రధాన ఆధారమని, ప్రజల సహకారంతో కుప్పాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రతినిధులు, యువత, మహిళలు, వార్డు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.