
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 09:
రేణిగుంట ప్రాంతంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి డింపు సాయి పై టీచర్ ప్రవర్తనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోంవర్క్ రాయలేదని ఆగ్రహించిన టీచర్,డింపుసాయి పై డస్టర్ విసరడంతో అతనికి తలపై తీవ్ర గాయం అయినట్లు సమాచారం. గాయం ఎలా జరిగిందని ఎవరైనా అడిగితే బెల్ట్ తగిలిందని చెప్పాలని విద్యార్థిని టీచర్ బెదిరించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.