chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 4:16 am Digital Edition : CHITTOORE EXPRESS

హంద్రీనీవాతో కుప్పానికి జలకళ: నారా భువనేశ్వరి పర్యాటక అభివృద్ధి, పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

రామకుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై 27:

 

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రామకుప్పం మండలంలోని నారాయణపురం తాండా, ననియాల తాండా, పీఎంకే తాండా, పండ్యాలమడుగు తదితర ప్రాంతాల్లో మహిళలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పానికి చేరడంతో దశాబ్దాల నీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రస్తుతం వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, 110 చెరువులు నింపినట్లు తెలిపారు. భవిష్యత్తులో అన్ని చెరువులకు కృష్ణా జలాలు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కుప్పంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, ఎకో టూరిజం కోసం రూ.7 కోట్లు కేటాయించడంతో పాటు పర్యాటక అభివృద్ధి పనులకు రూ.3.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జింకల పార్కు, జంగిల్ హట్ రిసార్ట్, చిన్నారుల కోసం ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. కుప్పం నియోజక వర్గానికి పరిశ్రమలు రావడం వల్ల వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, నైపుణ్య శిక్షణను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, దీపం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, అన్నా క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాలద్వారా ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. పీ-4 కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. వివిధ తాండాల్లో స్థానికులు తాగునీటి సౌకర్యం, వాటర్ ట్యాంకర్లు, వీధి దీపాలు, గోకులం షెడ్లు, చెక్‌డ్యామ్, రహదారులు తదితర మౌలిక వసతులపై వినతులు సమర్పించగా, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.