
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్, మే 29:
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని సిరి కళాక్షేత్రం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి లెవల్–1 పరీక్షలు గురువారం విజయవంతంగా పూర్తయ్యాయి. విద్యార్థులు తమ ప్రతిభ, క్రమశిక్షణ, నృత్య నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ కళలను చిన్నారుల్లో పెంపొందించేందుకు సిరి కళాక్షేత్రం సొసైటీ కృషి చేస్తోందన్నారు. కూచిపూడి నృత్యంలో విద్యార్థులు చూపిన ఆసక్తి, సాధన ప్రశంసనీయమని పేర్కొన్నారు.విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న గురువు కేపీ సునీత మహేష్ సేవలను నిర్వాహకులు అభినందించారు. చిన్నారుల్లో కళాప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పరీక్షల పరిశీలకులుగా హైదరాబాద్ కు చెందిన సాయి దత్త, కుప్పంకు చెందిన శ్రావణ్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను పరిశీలించి సూచనలు అందించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్ కళా ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పిల్లల అభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం వల్లే విద్యార్థులు కళారంగంలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.