chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 9:02 am Digital Edition : CHITTOORE EXPRESS

సిఆర్ఎస్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం  మానసిక ప్రశాంతతకు,శారీరక దృఢత్వానికి యోగా ఎంతో అవసరం సిఆర్ఎస్ సిడబ్ల్యూఎం ఆనంద్

 

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 21:

 

యోగఅనేది శ్వాస నియంత్రణ,ధ్యానం, ఆసనాల కలయిక. ఇది శారీరక దృఢత్వాన్ని,మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందించడంలో ఎంతో తోడ్పడుతుందని క్యారేజ్ రిపేర్ షాప్(సిఆర్ఎస్) సిడబ్ల్యూఎం బి.ఆనంద్ అన్నారు.ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు,సిడబ్ల్యూఎం ఆనంద్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు,యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిడబ్ల్యూఎం బి.ఆనంద్ మాట్లాడుతూ మన భారత ప్రాచీన సాంప్రదాయంలో యోగా ఒక భాగం. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. శ్వాసపై నియంత్రణ ధ్యానం వివిధ ఆసనాలు మొదలైనవి ఇందులో ఉండే ప్రధాన అభ్యాసాలుగా పేర్కొన్నారు. ఒకప్పుడు సిద్ధులు,సన్యాసులు, యోగులు మాత్రమే ఆచరించే ఈ యోగ ప్రస్తుతం మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిందన్నారు.రోజూ యోగా చేయడం వల్ల కండరాల బలం,శరీర సమతుల్యత మెరుగవుతాయన్నారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాక, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచించారు. యోగ ఆసనాలు,ప్రాణాయామం ద్వారా నాడీ వ్యవస్థ శాంతించి,మానసిక ఒత్తిడి, ఆందోళన,నిద్రలేమి సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ధ్యానం మనస్సును కేంద్రీకరించడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుందని అదేవిధంగా అంతర్గత అవయవాలను ఉత్తేజపరిచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని తెలియజేశారు.క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయని, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా,కరోనరీ ఆర్టరీ డిసీజ్ కు ప్రధాన కారణమైన ఒత్తిడి,ఆందోళనలను తగ్గిస్తుందన్నారు.కావున ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డబ్ల్యూపిఓ శ్రీనివాస నాయక్,సీనియర్ డిఎంఓ డాక్టర్ కుమార్,డీఎంఓ డాక్టర్ వెంకట పవన్, సీఎంటి ఎస్.కే కాజా,డబ్ల్యుఎం భానుప్రకాష్,ఎడబ్ల్యుఎం నవీన్ కుమార్, యోగా మాస్టర్ మురళీమోహన్, సిఆర్ ఎస్ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ కాళహస్తి బాబు,ఓబిసి,సెక్రటరీ రమణ,చైర్మన్ మునేయ్య ఎస్సీ,ఎస్టీ నాయకులు,ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.