
తిరుపతి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 06:
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంగళవారం నాడు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటి రూపాయల అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గోవిందరావును కలిసి ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి, జిల్లా నాయకులు మురళీగౌడ్, మధులత, సుచేంద్ర తదితరులు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ శాఖలో నిధుల వినియోగంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రజల కోసం కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించబడలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుని నిజాలను వెలికి తీయాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.