
గుడుపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 10:
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దగొల్లపల్లి గ్రామంలో పశ్చిమ వాహిని వేపమానుకొండపై వెలసిన శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంపాట విజయవంతంగా ముగిసిందని దేవస్థానం ఈవో పి .రమణ తెలిపారు. ఈ వేలంపాట ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.9.45 లక్షల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. వేలంపాటలో లడ్డు ప్రసాదం హక్కు రూ.6.24 లక్షలు, అంగళ్లు/గేటు హక్కు రూ.82 వేలకు, పార్కింగ్ హక్కు రూ.59 వేలకు, తలనీలాలు (కేశఖండన) హక్కు రూ.1.80 లక్షలకు దక్కినట్లు ఈవో తెలిపారు. దేవదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఈ వేలంపాటలో భక్తులు, కాంట్రాక్టర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడి నెల ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ వేలంపాటకు మంచి స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు.