
వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే12:
వి.కోట పట్టణంలోని శ్రీవీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.స్వామివారికి పంచామృతా భిషేకం,తేనె అభిషేకం వైభవంగా నిర్వహించారు.అనంతరం గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహాన్ని సింధూరంతో అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని భక్తులకు కనువిందుగా తీర్చిదిద్దారు. ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం ముందు భాగంలో శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో రామ భజనలు, వీరాంజనేయ స్వామి భజనలు భక్తిరసపూరితంగా నిర్వహించారు. భజనలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. చిన్నారులు, మహిళలు, యువకులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.వేడుకల నిర్వహణలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొని సేవలు అందించారు.