కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి11:
పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కుప్పం పట్టణంలోని శ్రీ ప్రియ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో సిబ్బందికి ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ ప్రియ నర్సింగ్ హోమ్ అధినేత, కుప్పం పట్టణ మాజీ అధ్యక్షులు డాక్టర్ సుధీర్ తన సిబ్బందికి సుమారు 100 ఈ సైకిళ్లను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ సైకిళ్ల పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఒకేసారి సుమారు 5555 సైకిళ్లను పంపిణీ చేసి వరల్డ్ గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో శ్రీ ప్రియ నర్సింగ్ హోమ్ సిబ్బందికి సైకిళ్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీఎంకే చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, టిటిడి డైరెక్టర్ శాంతారామ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఈ సైకిళ్లతో కుప్పం పట్టణంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ముఖ్య అతిథులు జండా ఊపి ప్రారంభించగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్కు డాక్టర్ సుధీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం పురపాలక సంఘం అధ్యక్షులు సెల్వ రాజు, పట్టణ టిడిపి అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్, బెస్త కుల కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమగళ్, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు జాకీర్ అహ్మద్, క్లస్టర్ ఇంచార్జీలు సోము, కన్నన్, కోక్లస్టర్ శ్యాంసుందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, నాయకులు లోకేష్ బాబు, కదిరప్ప, ప్రమోద్ తదితర నాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, శ్రీ ప్రియ నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రియ, ఆసుపత్రి సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.