chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 7:19 pm Digital Edition : CHITTOORE EXPRESS

శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక జాతర ఖర్చుల్లో పూర్తి పారదర్శకత :  ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే16:

 

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఆలయ జమాకర్చులను వివరిస్తూ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బి ఎం కె రవిచంద్రబాబు ఆధ్వర్యంలో ఈ ఓ రమణ నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణలో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా పూర్తి పారదర్శకతతో ఖర్చులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతర ఖర్చులకు సంబంధించిన అన్ని లెక్కలను స్పష్టంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 20 వేల మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన ఆభరణాలను దేవాదాయ శాఖ ఈఓకు అప్పగించినట్లు చెప్పారు. సుమారు 30 కేజీల వెండితో నాగ పడిగలను తయారు చేయించామని తెలిపారు. పేద ప్రజలకు నిరంతర అన్నదానం నిర్వహించేందుకు “మన అన్నా క్యాంటీన్” పేరుతో ప్రత్యేక ట్రస్ట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ పేరుతో బ్యాంక్ ఖాతా ప్రారంభించామని, ఆ ఖాతాలో దాతలు అందించే విరాళాలతో అన్నదాన కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. దీనిపై అసత్య ప్రచారాలు తగదన్నారు. తిరుపతి గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆలయాన్ని ప్రత్యేక ప్రణాళికతో పునర్నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే గంగమ్మ ఆలయానికి సుమారు రెండు ఎకరాల భూమిని భూదానం ద్వారా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆలయ విస్తరణకు ఈ భూమి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, గాజుల గోపీనాథ్, ఆర్ఆర్ రవి, మంజునాథ్,నరేష్,ఎన్ జ్యోతిష్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి నరేష్ , కూటమి నాయకులు, ఆలయ పాలక మండలి సభ్యులు, పూజార్ల బృందం తదితరులు పాల్గొన్నారు.