శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్లు ప్రాంతంలో ఉన్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ బుకింగ్ సమస్యపై వివరణ కోరేందుకు వెళ్లిన ఓ వినియోగదారుడు సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత వినియోగదారుడి కథనం ప్రకారం, గత నాలుగు రోజులుగా గ్యాస్ బుకింగ్ నమోదు కాకపోవడంతో కారణం తెలుసుకునేందుకు ఏజెన్సీకి సంబంధించిన ఫోన్ నంబర్లకు పలుమార్లు కాల్ చేసినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. దీంతో నేరుగా కార్యాలయానికి వెళ్లి ఫోన్ ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించగా, అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. వినియోగదారుడి ఆరోపణల ప్రకారం, మాకు వ్యక్తిగత ఫోన్లు వస్తుంటాయి. ఆ సమయంలో మీ కాల్స్ తీసుకోలేం అని సిబ్బంది సమాధానమిచ్చారని తెలిపారు. దీనిపై తిరిగి ప్రశ్నించగా, మేము కంపెనీ ఫోన్లు ఎత్తము. మీకు ఎక్కడ ఫిర్యాదు చేయాలనుకుంటే అక్కడ చేయండి. మా యజమానితో మాట్లాడుకోండి. మీకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సిబ్బంది మాట్లాడినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై వినియోగదారులు స్పందిస్తూ, ప్రజలకు సేవలు అందించే సంస్థల్లో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ గ్యాస్ ఏజెన్సీలో సిబ్బంది వినియోగదారుల పట్ల పలుమార్లు అమర్యాదగా మాట్లాడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నప్పటికీ, యాజమాన్యం గాని, హెచ్పి సమస్తవారు కానీ, సివిల్ సప్లై శాఖ అధికారులు కానీ స్పందించకపోవడం విచారకరంగా భావించాల్సి ఉంది. వినియోగదారుల ఫోన్ కాల్స్కు సకాలంలో స్పందించి, సమస్యలను పరిష్కరించే విధంగా సేవలు అందించాలని కోరుతున్నారు.
