
కడప,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 29:
కడప–చెన్నై జాతీయ రహదారికి సమీపంలోని మాధవరం–1, పార్వతీపురం గ్రామంలో వెలసిన శ్రీ శీతల గంగమ్మ అమ్మవారి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ జాతరలో అమ్మవారి దర్శనం కోసం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, పంచామృతాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా అలంకరించి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారి రంగమ్మ తెలిపారు. గురువారం అమ్మవారికి బోనాల సమర్పణ, గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర వికాస కార్యదర్శి రాటాల రామయ్య, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సుధా మురళి, మన ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రవికుమార్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.