
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే13 :
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో బుధవారం పలు అభివృద్ధి, రాజకీయ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిగం ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలమనేరు –కుప్పం రహదారి పక్కన తుమ్మిసి రోడ్డులోని వాదల చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్సీ ప్రారంభించారు. వాటర్ షెడ్ నిధులతో సుమారు రూ.44 లక్షల వ్యయంతో చెరువు పూడికతీత, నడక మార్గం, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కుప్పం ప్రాంతంలోని చెరువులకు కొత్త వెలుగు వస్తోందన్నారు. హంద్రీనీవా జలాలతో చెరువులను నింపి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో మొదటి దశలో 160కు పైగా చెరువులకు హంద్రీనీవా నీటిని అందించామని, మిగిలిన చెరువులకు రెండో దశలో కృష్ణా జలాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అనంతరం దండికుప్పం పంచాయతీ నల్లరాళ్లపల్లి గ్రామానికి చెందిన రుక్మానందరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు 50 కుటుంబాలు, దండికుప్పం గ్రామానికి చెందిన మరో 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. తదనంతరం చౌడేపల్లి గ్రామంలో మాజీ రెస్కో డైరెక్టర్ విజయ్ కుమార్ తమ్ముడి భార్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కార్మిక సంక్షేమ డైరెక్టర్ భాష్యం విశ్వనాథ్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు నందిగం ఉదయ్ కుమార్, క్లస్టర్ ఇన్చార్జిలు రాజేంద్ర, నాగరాజు, రెస్కో డైరెక్టర్లు బసవరాజు, చలపతి, అనసూయ, నాయకులు జెనీ, ఉయ్యాల జయరామిరెడ్డి, సుగుణమ్మ, ఆంజనేయరెడ్డి, హరినాథ్ రెడ్డి, మంజునాథ్, ఏఎంసీ నాగరాజు, శివ, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.