
వి.కోట,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూన్ 04:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం వి.కోట పట్టణంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి, వీకోట మండల అధ్యక్షుడు యువరాజ్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ జి.శ్రీనివాసులు (వాసు) ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫల మైందని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి అందించలేదని, మహిళలకు పూర్తిస్థాయిలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించలేదని ఆరోపించారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడమే కాకుండా, ఇప్పటికే ఉన్న పలువురి పెన్షన్లను తొలగించారని విమర్శించారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా ప్రజలను నిరాశపరిచిందని అన్నారు. రైతులు, మహిళలు,యువత,వృద్ధులు సహా అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాల తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల ను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.