
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూన్ 05:
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం మండలంలోని వెండుగాంపల్లి గ్రామాన్ని కుప్పం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ సందర్శించి గ్రామ ప్రజలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.ముఖ్యంగా ధైర్య-స్పర్శ కార్యక్రమం గురించి వివరిస్తూ మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక పరమైన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వివరించారు.అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్లైన్ లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియజేయవద్దని చెప్పారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు సహాయం పొందాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మల్లేష్ యాదవ్ తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.