chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 3:26 pm Digital Edition : CHITTOORE EXPRESS

వి.కోట కవులకు ఎస్‌పీ బాలు జాతీయ పురస్కారం

వి.కోట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 04:

 

భారతీయ తెలుగు రచయితల సమాఖ్య,ఎంవీ కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్,చిత్తూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పురస్కార ప్రదానోత్సవం-2026లో వీకోటకు చెందిన ఇద్దరు సాహితీవేత్తలు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారాలను అందుకొని ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు. చిత్తూరులోని కట్టమంచి రోడ్డులో ఉన్న ఎల్‌జీబీ టవర్స్ ఫంక్షన్ హాల్‌లో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వ స్వరకర్త ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత వైభవాన్ని స్మరించుకుంటూ పలువురు కళాకారులు గీతాలాపన చేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వి.కోటకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కవికోకిల కొఠారి వెంకటరత్నం, కవయిత్రి,విశ్రాంత ఉపాధ్యాయురాలు డాక్టర్ గడ్డం శాంతకుమారి సాహిత్య రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక, పురస్కారాన్ని స్వీకరించారు. సాహిత్య,సాంస్కృతిక రంగాల్లో వీరు చేసిన సేవలను కార్యక్రమంలో పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు భాష, సాహిత్య వికాసానికి వారి కృషి అభినందనీయ మని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మర్రిపూడి దేవేంద్ర రావు,డాక్టర్ ఎంవీ శ్రీధర్ రెడ్డి,డాక్టర్ సి. నారాయణస్వామి,జిల్లా జైలు సూపరిం టెండెంట్ కె. వెంకటరెడ్డి, మిద్దెల హరి, రాజారత్నం మునీంద్ర, రాజరత్నం, తోట గోవిందన్, హరినాథ్ రెడ్డి, మునీంద్ర, తిరుపతి షాజహాన్ బాషా, లయన్స్ క్లబ్ సభ్యులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, కవులు, రచయితలు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలను పలువురు సాహితీమిత్రులు, అభిమానులు అభినందిస్తూ మరిన్ని సాహిత్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.