chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 8:33 am Digital Edition : CHITTOORE EXPRESS

విలేఖరి హత్యపై ఆగ్రహం:  నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 29:

 

చిత్తూరు జిల్లా వి.కోటలో విలేఖరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనపై తీవ్రఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తిరుపతి జిల్లా ఐడిజెఎన్ అధ్యక్షులు డి కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయం లోనే దుండగులు వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై, వారి కార్యాలయాలపై దాడులు పెరుగుతు న్నాయని, ఇది చాలా ఆందోళనకరమని అన్నారు. వి.కోటలో ప్రశాంత వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన స్థానిక ప్రజల్లో భయాందోళన లు రేకెత్తించింది. వాకింగ్ చేస్తున్న సమయంలోనే విలేఖరిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ముందుగా వెంటాడి పట్టుకుని విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసినట్లు స్థానికులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. దాడి సమయంలో సహాయం కోరుకునే అవకాశమే లేకుండా క్రూరంగా హత్య చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఐడిజెఎన్ సభ్యులు నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేఖరులపై దాడులను అరికట్టేందుకు అన్ని జర్నలిస్టుల సంఘాలు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.