chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 10:00 pm Digital Edition : CHITTOORE EXPRESS

విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకేసులో  నిందితులపై పీడీచట్టం కఠిన చర్యలుతప్పవు:  సీఐ సోమశేఖర్ రెడ్డి

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 17:

 

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలంలోని ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకేసులో నిందితులైన తమిమ్, సుభాన్‌లపై పీడీచట్టం అమలు చేసేందు కు చర్యలు చేపడుతున్నట్లు వి.కోట సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ.. నిందితుల పై ఇప్పటికే పన్నెండు కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. ఎర్రచందనం, గంజాయి కేసులతో పాటు పలు నేరాల లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్మోహన్ రెడ్డితో పాటు శ్రీనివాసులతో ఉన్న పాత విభేదాలు కారణమయ్యాయ ని తెలిపారు. గంజాయి కేసులో ఆరిఫ్‌ను తప్పించడం, ఇరు వర్గాల ఘర్షణల నేపథ్యంలో గ్రామ బహిష్కరణకు గురికావడం వంటి పరిణామాలతో జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. హత్యకు ముందు నిందితులు మృతుడు వాకింగ్‌కు వెళ్లే సమయాలను గమనిస్తూ ముందస్తుగా నిఘా నిర్వహించినట్లు చెప్పారు. వాకింగ్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేసి హత్య చేసి పరారైనట్లు తెలిపారు. అనంతరం బెంగళూరులో గంజాయి కేసులో బెయిల్‌పై ఉన్న కేసు లో వాయిదాలకు హాజరుకాకపోవడంతో అక్కడి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వివరించారు. ఈ కేసులో మరికొందరు సహకరించినట్లు ఆధారాలు లభించాయని, నిఘా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. పలువురు నిందితులతో ఫోన్‌లో మాట్లాడిన విషయంపై కూడా విచారణ కొనసాగుతోందన్నారు. వారి పాత్రపై ఆధారాలు లభిస్తే కేసులో ముద్దాయిలు గా చేర్చనున్నట్లు తెలిపారు. హత్య కేసు విచారణ ఇప్పటివరకు యాభై శాతం పూర్తయ్యిందని, కోర్టు అనుమతితో మరోసారి పోలీసు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయి విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలతో కేసును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.