
వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 28
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురి కావడంపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రశాంత ప్రాంతంగా పేరున్న వి.కోటలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా విలేకరిపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.