
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 02:
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని జరుగు గ్రామంలో గురువారం నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమం గ్రామీణ ప్రజల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తూ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం కొబ్బరి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.., పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు. తదుపరి “125 రోజులు – గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ” కార్యక్రమంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం, వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు, జీవనోపాధి భద్రత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక ప్రయోజనాలు అందుతున్నాయని వివరించారు. ప్రతి అర్హ కుటుంబం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి, తాగునీటి వసతుల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల, వైద్య సేవల విస్తరణ, ఉపాధి అవకాశాల సృష్టి, మౌలిక సదుపాయాల బలోపేతం వంటి అనేక రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తోందని, ప్రజల సహకారంతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు రాజగోపాల్, మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్, మహేంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు సంఖ్యలో పాల్గొన్నారు.