
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 23:
చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లె పంచాయతీ పరిధిలోని వరమనూరు గ్రామంలో దశాబ్దాలుగా నెలకొన్న స్మశానవాటిక సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలోని సుమారు 70 కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మశానవాటిక కోసం అనువైన స్థలాన్ని అధికారులు, స్థానిక నాయకులు పరిశీలించి కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్థల పరిశీలన కార్యక్రమంలో స్థానిక నాయకుడు, నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు బాలాజీ, మాజీ క్లస్టర్ ఇన్చార్జి మహేంద్రబాబు, సర్వేయర్ నాగేంద్ర, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. స్మశానవాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో వరమనూరు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి ఈ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టి గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.